కంటెంట్‌కు వెళ్లు

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు ఎందుకు చనిపోయాడు?

బైబిలు ఇచ్చే జవాబు

 మనుషులు పాపక్షమాపణను, శాశ్వత జీవితాన్ని పొందడం కోసం యేసు చనిపోయాడు. (రోమీయులు 6:23; ఎఫెసీయులు 1:7) అంతేకాదు ఆయన చనిపోవడం ద్వారా, ఒక మనిషి అత్యంత తీవ్రమైన కష్టాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండగలడని నిరూపించాడు.—హెబ్రీయులు 4:15.

 ఒక్క మనిషి చనిపోవడం వల్ల అవన్నీ ఎలా సాధ్యమౌతాయో పరిశీలిద్దాం.

  1.   యేసు చనిపోవడం వల్ల “మన పాపాలు క్షమించబడ్డాయి.”—కొలొస్సయులు 1:14.

     మొట్టమొదటి మనిషి అయిన ఆదాము ఏ పాపం లేకుండా పరిపూర్ణంగా సృష్టించబడ్డాడు. కానీ అతను దేవునికి అవిధేయత చూపించాడు. ఆ అవిధేయత లేదా పాపం, అతని సంతానమంతటి మీద ప్రభావం చూపించింది. ‘ఒక్క మనిషి అవిధేయత ద్వారా అనేకులు పాపులయ్యారని’ బైబిలు చెప్తుంది.—రోమీయులు 5:19.

     యేసు కూడా పరిపూర్ణుడే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. కాబట్టి మన పాపాల కోసం “ప్రాయశ్చిత్త బలిని” అర్పించడానికి ఆయన అర్హుడు. (1 యోహాను 2:2; అధస్సూచి) ఆదాము చూపించిన అవిధేయత వల్ల మానవజాతి మొత్తానికి పాపం అనే మరక అంటుకుంది. యేసు మరణం ఆ మరకలను పూర్తిగా తుడిచేస్తుంది.

     ఒక విధంగా చెప్పాలంటే, ఆదాము మానవజాతిని పాపానికి అమ్మేస్తే, యేసు ఇష్టపూర్వకంగా చనిపోవడం ద్వారా వాళ్లను కొనుక్కున్నాడు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు.”—1 యోహాను 2:1.

  2.   ‘తనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని’ యేసు చనిపోయాడు.—యోహాను 3:16.

     ఆదాము నిరంతరం జీవించేలా సృష్టించబడినప్పటికీ, పాపం చేయడం వల్ల అతనికి మరణశిక్ష పడింది. ఆదాము ద్వారా “పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”—రోమీయులు 5:12.

     దీనికి భిన్నంగా, యేసు మరణం ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ల పాపపు మరకల్ని తుడిచేయడమే కాకుండా, మరణశిక్షను కూడా రద్దు చేసింది. బైబిలు ఇలా చెప్తుంది: “పాపం మరణంతో కలిసి రాజుగా ఏలినట్టే, నీతి ద్వారా అపారదయ రాజుగా ఏలాలని దేవుడు అలా చేశాడు; ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవితం పొందాలన్నది దేవుని ఉద్దేశం.”—రోమీయులు 5:21.

     నిజమే, మనుషులు ఈ రోజుల్లో ఎక్కువకాలం జీవించట్లేదు. అయితే నీతిమంతులకు శాశ్వత జీవితం ఇస్తానని, చనిపోయిన వాళ్లను పునరుత్థానం చేస్తానని, వాళ్లు కూడా యేసు త్యాగపూరిత మరణం ద్వారా ప్రయోజనం పొందుతారని దేవుడు మాటిస్తున్నాడు.—కీర్తన 37:29; 1 కొరింథీయులు 15:22.

  3.   యేసు “చనిపోయేంతగా లోబడడం” ద్వారా, ఎలాంటి కష్టాలు లేదా శోధనలు వచ్చినా మనుషులు దేవునికి నమ్మకంగా ఉండగలరని నిరూపించాడు.—ఫిలిప్పీయులు 2:8.

     పరిపూర్ణ మేదస్సు, శరీరం ఉన్నా, ఆదాము తనదికాని దాని కోసం ఆశపడి దేవునికి అవిధేయత చూపించాడు. (ఆదికాండము 2:16, 17; 3:6) తర్వాత దేవుని ప్రధాన శత్రువైన సాతాను, ఏ మనిషైనా స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తాడనీ, ప్రాణం మీదకు వస్తే ఏదైనా చేస్తాడనీ ఆరోపించాడు. (యోబు 2:4) కానీ పరిపూర్ణ మనిషైన యేసు అవమానకరమైన, బాధాకరమైన మరణాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా దేవునికి లోబడ్డాడు, ఆయనకు విశ్వసనీయంగా ఉన్నాడు. (హెబ్రీయులు 7:26) ఆ విధంగా, ఎలాంటి కష్టాలు లేదా శోధనలు వచ్చినా మనుషులు దేవునికి నమ్మకంగా ఉండగలరని యేసు తిరుగులేని విధంగా నిరూపించాడు.

యేసు మరణం గురించిన ప్రశ్నలు

  •    మనుషుల్ని విడిపించడానికి యేసు ఎందుకు అంతగా బాధపడి చనిపోవాల్సివచ్చింది? దేవుడే మరణశిక్షను రద్దు చేస్తే సరిపోయేది కదా?

     “పాపంవల్ల వచ్చే జీతం మరణం” అని దేవుడు నియమం పెట్టాడు. (రోమీయులు 6:23) ఆ నియమాన్ని ఆదాముకు తెలియజేస్తూ, తనకు అవిధేయత చూపిస్తే మరణశిక్ష పడుతుందని దేవుడు చెప్పాడు. (ఆదికాండము 3:3) ఆదాము పాపం చేసినప్పుడు, “అబద్ధమాడలేని దేవుడు” తన మాట నిలబెట్టుకున్నాడు. (తీతు 1:2) అలా ఆదాము పాపాన్నే కాదు, దానివల్ల వచ్చే జీతాన్ని అంటే మరణాన్ని కూడా తన సంతానానికి వారసత్వంగా ఇచ్చాడు.

     పాపం వల్ల మనుషులు మరణశిక్షకు అర్హులైనప్పటికీ, దేవుడు వాళ్లపట్ల “అపారదయ” చూపించాడు. (ఎఫెసీయులు 1:7) వాళ్లను విడిపించడానికి పరిపూర్ణుడైన యేసును పంపించాడు. ఆ ఏర్పాటు ద్వారా అటు న్యాయాన్ని, ఇటు కనికరాన్ని అత్యున్నత స్థాయిలో చూపించాడు.

  •    యేసు ఎప్పుడు చనిపోయాడు?

     యేసు యూదుల పస్కా పండుగ రోజున, సూర్యోదయం నుండి తొమ్మిదో గంటకు అంటే మధ్యాహ్నం “దాదాపు మూడింటికి” చనిపోయాడు. (మార్కు 15:33-37, అధస్సూచి) ఆధునిక క్యాలెండర్‌ ప్రకారం అది సా.శ. 33 ఏప్రిల్‌ 1, శుక్రవారం.

  •    యేసు ఎక్కడ చనిపోయాడు?

     యేసును “కపాల స్థలం” అని పిలవబడిన చోట వేలాడదీశారు. “హీబ్రూ భాషలో దాన్ని గొల్గొతా అని పిలుస్తారు.” (యోహాను 19:17, 18) యేసు రోజుల్లో, ఆ స్థలం యెరూషలేము “నగర ద్వారం బయట” ఉండేది. (హెబ్రీయులు 13:12) బహుశా ఆ స్థలం ఒక కొండ మీద ఉండి ఉండొచ్చు. అందుకే, యేసును వేలాడదీయడాన్ని కొంతమంది “దూరంలో నిలబడి” చూశారని బైబిలు చెప్తుంది. (మార్కు 15:40) అయితే ప్రస్తుతం అది ఎక్కడ ఉందో మనకు ఖచ్చితంగా తెలీదు.

  •    యేసు ఎలా చనిపోయాడు?

     యేసు సిలువ మీద చనిపోయాడని చాలామంది నమ్ముతారు. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు.” (1 పేతురు 2:24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యేసు దేని మీద మరణించాడో చెప్పడానికి బైబిలు రచయితలు స్టౌరస్‌, క్సైలోస్‌ అనే రెండు గ్రీకు పదాలు ఉపయోగించారు. ఆ పదాలు, నిలువుగా ఉన్న ఒక కొయ్యను లేదా దుంగను సూచిస్తున్నాయని చాలామంది విద్వాంసులు చెప్తున్నారు.

  •    యేసు మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?

     యూదులు ప్రతీ సంవత్సరం జరుపుకునే పస్కా పండుగ రోజు రాత్రి, యేసు తన అనుచరులతో ఒక ఆచరణ ప్రారంభించి, ఇలా ఆజ్ఞాపించాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” (1 కొరింథీయులు 11:24) కొన్ని గంటల తర్వాత ఆయన చంపబడ్డాడు.

     బైబిలు రచయితలు, యేసును పస్కా రోజున అర్పించే గొర్రెపిల్లతో పోల్చారు. (1 కొరింథీయులు 5:7) ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందారని పస్కా ఆచరణ గుర్తు చేసేది. అదేవిధంగా, క్రైస్తవులు పాపమరణాల నుండి విడుదల పొందారని యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ గుర్తు చేస్తుంది. ప్రతీ సంవత్సరం పస్కాను చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం నీసాను 14న జరుపుకునేవాళ్లు; అదేవిధంగా తొలి క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణను సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నారు.

     ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రజలు, ప్రతీ సంవత్సరం నీసాను 14 ఏ తేదీన వస్తుందో ఆ రోజున యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.